
టాలీవుడ్లో తనదైన విలక్షణమైన కామెడీ టైమింగ్, అద్భుతమైన నటనతో అతి తక్కువ కాలంలోనే ‘మినిమం గ్యారెంటీ’ హీరోగా, వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి వరుస విజయాల తర్వాత, ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి తన బాక్సాఫీస్ సత్తాను చాటారు. ఈ భారీ విజయాల జోరులో ఉన్న నవీన్ పొలిశెట్టి, ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతోంది. సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకు ముందే, నవీన్ తన మార్క్ ప్రమోషన్లతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహించిన ఒక ప్రత్యేకమైన వేడుకలో, నవీ పొలిశెట్టి పాన్-ఇండియా దర్శకులను ఒకే ఫ్రేమ్లోకి తెచ్చి నెట్టింట పెద్ద హల్చల్ సృష్టించారు. ప్రశాంత్ నీల్, సుకుమార్, లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి మరియు హరీష్ శంకర్ వంటి అగ్ర దర్శకులతో కలిసి ఆయన ఒక 30 సెకన్ల ఫన్నీ వీడియో రీల్ను పంచుకున్నారు. ఈ వీడియోలో నవీన్ తనదైన శైలిలో మాట్లాడుతూ, “హాయ్ ఫ్రెండ్స్, ఇది నా కెరీర్లోనే కాస్ట్లీయెస్ట్ ఫ్రేమ్” అని చమత్కరించారు. లోకేష్ కనగరాజ్ రూ. 500 కోట్లు, రిషబ్ శెట్టి రూ. 800 కోట్లు, మైత్రీ మూవీస్ మరియు సుకుమార్ కలిసి రూ. 2000 కోట్లు, అలాగే ప్రశాంత్ నీల్ రూ. 2000 కోట్లు అని సరదాగా లెక్కలు కట్టారు. వీటికి తన రూ. 100 కోట్ల మార్కెట్ను కూడా కలిపి, ఇది మొత్తంగా రూ. 5,500 కోట్ల భారీ ఫ్రేమ్ అంటూ నవ్వులు పూయించారు.
నవీన్ పొలిశెట్టి ఈ విధంగా క్రేజీ నంబర్లతో సరదాగా లెక్కలు చెబుతుంటే, పక్కనే ఉన్న దర్శకులు ప్రశాంత్ నీల్, సుకుమార్ నవ్వు ఆపుకోలేక వెనక్కి తిరిగారు. అయితే ఈ ఫ్రేమ్లో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ను ప్రత్యేకంగా ఎలాంటి నంబర్ ఇవ్వకుండా వదిలేయడంతో, నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ పాన్-ఇండియా దర్శకులందరూ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ ప్రాజెక్టులు చేస్తుండటంతో, నవీన్ వారిని కలవడం వెనుక పెద్ద ప్లానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.
అనుకున్నట్లుగానే, మైత్రీ మేకర్స్ సంస్థ ఈ వీడియోపై నవీన్ పొలిశెట్టితో తమ తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ధృవీకరించింది. నవీన్ను తమ మైత్రీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, ఆయన్ను ఒక ‘స్టార్ ఎంటర్టైనర్’ అని కొనియాడారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నవీన్ పొలిశెట్టి గత జనవరి నెల నుండి ఎంతో అంకితభావంతో స్క్రిప్ట్ వర్క్పై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, మైత్రీ సంస్థ ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించనుంది. ఈ సినిమా 2027లో గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నవీన్ ఎనర్జీకి సరిపోయే ఒక వినూత్నమైన కామెడీ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని, ఒక కొత్త తమిళ దర్శకుడు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో చూడాలి.




